మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టుపై ఆతిథ్య ఇంగ్లాండ్కి పట్టు చిక్కింది. వైస్ కెప్టెన్ బెన్స్టోక్స్ (176: 356 బంతుల్లో 17x4, 2x6) భారీ శతకానికి, ఓపెనర్ డొమినిక్ సిబ్లే (120: 372 బంతుల్లో 5x4) సమయోచిత సెంచరీ తోడవడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ని 469/9తో శుక్రవారం డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు భారత కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి ఆట ముగిసే సమయానికి 32/1తో నిలిచింది. క్రీజులో ఓపెనర్ క్రైగ్ బ్రాత్వైట్ (6 బ్యాటింగ్), నైట్ వాచ్మన్ అల్జారీ జోసెఫ్ (14 బ్యాటింగ్: 18 బంతుల్లో 1x4) ఉండగా.. ఆ జట్టు ఇంకా 437 పరుగులు తొలి ఇన్నింగ్స్ కంటే వెనకబడి ఉంది. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్నైట్ 207/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సిబ్లే- బెన్స్టోక్స్ జోడీ నాలుగో వికెట్కి ఏకంగా 260 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. బెన్స్టోక్స్ సెంచరీ తర్వాత బ్యాట్ ఝళిపించగా.. సిబ్లే అతనికి మంచి సహకారం అందించాడు. అయితే.. జట్టు 341 వద్ద సిబ్లేని పెవిలియన్కి పంపిన విండీస్ టీమ్.. ఆ తర్వాత పోప్ (7), క్రిస్వోక్స్ (0), శామ్ కరన్ (17)లను కుదురుకోనివ్వలేదు. కానీ.. మధ్యలో జో రూట్ (40: 79 బంతుల్లో 4x4) కాస్త నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా.. 162 ఓవర్లకి ఇంగ్లాండ్ 469/9తో నిలిచిన దశలో జో రూట్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశాడు. వాస్తవానికి ఇంగ్లాండ్ ఆఖరి వికెట్ పడిన తర్వాత లేదా 500 స్కోరుని అందుకున్న తర్వాత డిక్లేర్ చేస్తుందని అంతా ఊహించారు. ఆఖర్లో బ్యాటింగ్కి వచ్చిన డామ్ బెస్ (31 నాటౌట్: 26 బంతుల్లో 3x4, 1x6) కూడా దూకుడుగా ఆడుతూ కనిపించాడు. కానీ.. శుక్రవారం చివరి సెషన్లో కొత్త బంతితో కాసేపు వెస్టిండీస్ బ్యాట్స్మెన్లను ఇబ్బందిపెట్టాలని భావించిన కెప్టెన్ జో రూట్.. ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశాడు. అతని అంచనా నిజమైంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్లోనే ఓపెనర్ జాన్ కాంప్బెల్ (12: 34 బంతుల్లో 2x4) వికెట్ని ఇంగ్లాండ్ తీయగలిగింది.
from క్రికెట్ వార్తలు: Latest India Cricket News, Today Match Score, Highlights | Samayam Telugu https://ift.tt/3fG6kZe
No comments:
Post a Comment