ఐపీఎల్ 2020 సీజన్కి కొత్త లోగోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆవిష్కరించింది. ఇటీవల ఐపీఎల్ 2020 సీజన్ స్ఫాన్సర్షిప్ నుంచి చైనాకి చెందిన వివోని తప్పించిన బీసీసీఐ.. బిడ్స్ని ఆహ్వానించి.. రూ. 222 కోట్లకి ఆ హక్కుల్ని డ్రీమ్11కి అప్పగించిన విషయం తెలిసిందే. దాంతో.. కొత్త టైటిల్ స్ఫాన్సర్ డ్రీమ్11తో ఐపీఎల్ లోగోని బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లు జరగనుండగా.. మొత్తం 53 రోజుల పాటు 60 మ్యాచ్ల్ని నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. నెల రోజుల ముందే ఆటగాళ్లని యూఏఈకి పంపాలని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ ఆదేశించడంతో.. గురువారమే కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఈరోజు మిగిలిన జట్లు కూడా యూఏఈకి వెళ్లే అవకాశం ఉంది. ఐపీఎల్ 2020 సీజన్ని పూర్తి బయో- సెక్యూర్ వాతావరణంలో బీసీసీఐ నిర్వహించనుండగా.. యూఏఈకి చేరుకున్న ఆటగాళ్లు ఆరు రోజులు క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ క్వారంటైన్ టైమ్లోనే వారికి మూడు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి.. నెగటివ్ వస్తే.. అప్పుడు బయో- సెక్యూర్ బబుల్లోకి వారిని అనుమతిస్తారు. ఆటగాళ్లతో పాటు కోచ్, టీమ్ సహాయ సిబ్బంది, హోటల్ స్టాఫ్, డ్రైవర్లు కూడా ఈ బబుల్లో ఉండనున్నారు. టోర్నీ ముగిసే వరకూ ఈ బబుల్లో ఉన్న వారు వెలుపలి వ్యక్తుల్ని డైరెక్ట్గా కలవడానికి అనుమతించరు.
from క్రికెట్ వార్తలు: Latest India Cricket News, Today Match Score, Highlights | Samayam Telugu https://ift.tt/32dJZN0
No comments:
Post a Comment