వెస్టిండీస్తో శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20లో భారత్ జట్టు ఓడిపోయేలా కనిపించింది. మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో నికోలస్ పూరన్ (62: 41 బంతుల్లో 5x4, 3x6), రోవ్మాన్ పోవెల్ (68 నాటౌట్: 36 బంతుల్లో 4x4, 5x6) విధ్వంసక హిట్టింగ్తో వెస్టిండీస్ని 18 ఓవర్లు ముగిసే సమయానికి 158/2తో మెరుగైన స్థితిలో నిలిపారు. అప్పటికి ఇద్దరూ క్రీజులో ఉండగా.. ఏ బంతి వేసినా బలంగా హిట్ చేస్తూ కనిపించారు. దాంతో.. భారత్ శిబిరంలో కంగారు మొదలైంది. వెస్టిండీస్ విజయానికి ఆఖరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసేందుకు చేతికి కెప్టెన్ రోహిత్ శర్మ బంతినిచ్చాడు. గత ఏడాది నుంచి మునుపటి తరహాలో రాణించలేకపోతున్న భువీ.. ఎట్టకేలకి సరైన సమయంలో పూర్తి స్థాయిలో లయని అందుకుని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఈ క్రమంలో డెత్ ఓవర్లలో తనకి తిరుగులేదని మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్తూ.. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అతను తన అమ్ములపొదిలో దాగి ఉన్న అస్త్రాలన్నీ సంధించాడు. దెబ్బకి ఆ ఓవర్ ముగిసే సమయానికి మ్యాచ్ దాదాపు భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మొదటి బంతిని పొవెల్కి లోఫుల్ టాస్ రూపంలో భువీ సంధించగా.. అతను డీప్ మిడ్ వికెట్ దిశగా హిట్ చేసి సింగిల్ మాత్రమే తీయగలిగాడు. ఆ తర్వాత రెండో బంతిని నికోలస్ పూరన్కి స్లో డెలివరీ రూపంలో భువీ సంధించగా.. అతను ఆ బంతిని అంచనా వేయలేకపోయాడు. దాంతో.. కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. ఇక మూడో బంతిని నకుల్ బాల్ రూపంలో భువీ విసరగా.. పూరన్ సిక్స్ కోసం గట్టిగా హిట్ చేశాడు. కానీ.. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాలేదు. దాంతో.. గాల్లోకి ఎత్తుగా వెళ్లిన బంతిని రవి బిష్ణోయ్ క్యాచ్గా అందుకున్నాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో పొవెల్ రెండు, పొలార్డ్ ఒకటి ఎదుర్కొన్నా.. కేవలం సింగిల్స్ మాత్రమే తీయగలిగారు. ఆఫ్ స్టంప్కి కాస్త వెలుపలగా కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బంతుల్ని సంధించిన భువీ.. వారికి పెద్ద షాట్ ఆడే అవకాశమే ఇవ్వలేదు. ఆఖరి ఓవర్కి సమీకరణం 6 బంతుల్లో 25 పరుగులుగా మారిపోయింది. ఈ దశలో చివరి ఓవర్ బౌలింగ్కి వచ్చిన హర్షల్ పటేల్ తొలి రెండు బంతులకీ రెండు పరుగులే ఇచ్చినా.. మూడు, నాలుగో బంతిని పొవెల్ 6, 6గా మలిచేశాడు. దాంతో.. సమీకరణం 2 బంతుల్లో 11 పరుగులుగా మారిపోయింది. ఈ దశలో ఐదో బంతిని ఆఫ్ స్టంప్కి వెలుపలగా స్లో డెలివరీ రూపంలో హర్షల్ విసరగా.. ఆ బంతికి ఒక్క పరుగే రావడంతో భారత్ జట్టు ఊపిరి పీల్చుకుంది. చివరి బంతికి పొలార్డ్ సింగిల్ మాత్రమే తీయగలిగాడు. ఓవరాల్గా ఆఖరి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. భారత్ జట్టు 8 పరుగుల తేడాతో గెలిచింది.
https://ift.tt/P8F6IZs
from తెలుగు వార్తలు | Telugu Latest News | Online Telugu News | News in Telugu | Samayam Telugu https://ift.tt/JTX3d0n
No comments:
Post a Comment